మాధవి హెల్త్‌ బులెటిన్‌ విడుదల

20 Sep, 2018 18:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణాలతో పోరాడుతున్న మాధవి హెల్త్‌ బులిటెన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ..‘మాధవి ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటిలెటర్‌ తొలగించాం. 48 గంటల తర్వాత జనరల్‌ వార్డుకు తరలిస్తాం. తండ్రి ఇంత దారుణంగా దాడి చేయడంతో ఆమె తీవ్ర షాక్‌కు గురైంది. తన తల్లి.. తమ్ముడిని చూడాలని కోరింది. ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉండటంతో ఎక్కువ మందిని చూడటానికి అనుమతిని ఇవ్వటంలేదు’ అని తెలిపారు.

అసలేం జరిగిందంటే..
తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి, సెటిల్‌మెంట్‌ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు. బైక్‌పై వచ్చి మనోహర చారి బ్యాగులో తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేశాడు. ముందుగా సందీప్‌పై దాడి చేశాడు. మాధవి అడ్డుకోవడంతో ఆమెను విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే.


     

>
మరిన్ని వార్తలు