యేసు ప్రభువుతోనే మానవాళికి రక్షణ

9 Mar, 2015 02:19 IST|Sakshi

క్లాక్‌టవర్: మానవాళి కోసం ఈలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుతోనే మనకు సంపూర్ణ రక్షణ లభిస్తుందని అంతర్జాతీయ ముఖ్య ప్రసంగీకులు బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు. రక్షణ టీవీ ఎండి జక్కుల బెనహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సువార్త సంగీత ఉజ్జీవ మహోత్సవాలు చివరిరోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా బ్రదర్ అనిల్‌కుమార్ హాజరై ప్రసంగించారు. యేసుక్రీస్తును నమ్ముకొన్న ప్రతి విశ్వాసి ఆయనకు సాక్షులుగా ఉంటూ నిత్యజీవంలోకి ప్రవేశిద్దామన్నారు. చివరిరోజు శక్తివంతమైన దేవుని వాక్యాన్ని ఉత్సాహంగా అందించి ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపారు. దేవుడు తన కృపను అనుగ్రహిస్తే పాలమూర్‌కు మళ్లీ వచ్చి మూడు రోజుల పాటు సభలు నిర్వహిస్తానన్నారు. అనంతరం స్థానిక సం ఘాల పాస్టర్లు బ్రదర్ అనిల్‌కుమార్ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 
 ఆకట్టుకొన్న బ్రదర్ హనోకు గీతాలు...
 ప్రత్యేక సంగీత కచ్చేరితో సువార్త గాయకుడు బ్రదర్ హనోకు అందించిన ఆరాధన స్తుతి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందుకు సంగీత దర్శకుడు పిజెడి కుమార్ అందించిన సంగీతం మైదానంలో ఉన్నా విశ్వాసులందరిలో ఒక నూతనోత్సవాన్ని నింపింది. మూడు రోజులపాటు నిర్వహించిన మహోత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించడంతో ఎంబిసి చెర్మన్ రెవ.వరప్రసాద్ ప్రత్యేక గ్రీటింగ్స్ తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలిపారు.
 
 కెమెరామెన్ నుంచి
 మేనేజింగ్ డెరైక్టర్ స్థాయికి ఎదిగా...
 వృతిరీత్యా సినిమాల్లో కెమెరామెన్‌గా పనిచేస్తూ దేవుని ఆశీర్వాదంతో రక్షణ టీవీకి మేనేజింగ్ డెరైక్టర్‌ని అయ్యానని జక్కుల బెనహర్ అన్నారు. ఈరోజు సినిమాలో పనిచేసే కళాకారులంతా తమ చానెల్‌లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దేవుడు అనుగ్రహిస్తే ఉన్నత స్థాయికి వస్తామనేందుకు తానే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పొగ్రాం కన్వీనర్ యేసుపాదం, స్థానిక సంఘాల పాస్టర్లు ఎంఆర్ సుందర్‌పాల్, బిఎస్ పరంజ్యోతి, పృథ్వీరాజ్, జయపాల్‌తోపాటు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు