సాక్షి, హైదరాబాద్: యోగా భారత దేశంలో పుట్టిన గొప్ప సంపద అని, నేడు ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు సాధన చేయడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 5వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా టూరిజం–తెలంగాణ టూరిజం సంయుక్తంగా హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవనం యాంత్రికంగా మారడంతో మానసికంగా అంతా అలసిపోతున్నారని, శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడుకు కూడా యోగా ద్వారా వ్యాయామం అవసరమని సూచించారు. మన దేశంలో పుట్టిన యోగా, మెడిటేషన్లను ప్రపంచమంతా సాధన చేస్తుండటం గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.