నేడు రాష్ట్రానికి యూపీ సీఎం

7 Apr, 2019 02:58 IST|Sakshi

పెద్దపల్లి, ఎల్లారెడ్డి బహిరంగ సభల్లో ప్రసంగించనున్న యోగి

మరో మూడు చోట్ల పాల్గొననున్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ఆదివారం (7వ తేదీన) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో జరిగే పెద్దపల్లి నియోజకవర్గ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యా హ్నం 12:30 గంటలకు ఎల్లారెడ్డిలో నిర్వహించే జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభల్లో ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు పాల్గొననున్నారు.

అలాగే కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పురుషోత్తం రూపాల కూడా ఆదివారం వివిధ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం శేరిలింగంపల్లిలో బీజేపీ చేవెళ్ల అభ్యర్థి బెక్కరి జనార్ధన్‌రెడ్డి నేతృత్వంలో జరిగే ఐటీ ప్రొఫెషనల్స్‌ కార్‌ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మంలో నిర్వహించే ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు గద్వాలలో జరిగే బహిరంగసభలోనూ పాల్గొని మాట్లాడనున్నారు.

  

మరిన్ని వార్తలు