బాలికపై యువకుడి అత్యాచారం

17 Dec, 2019 05:23 IST|Sakshi

తాండూరులో ఆలస్యంగా వెలుగులోకి ఘటన

తాండూరు: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని తాండూరు శివాజీచౌక్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. తాండూరు మండలం దస్తగిరిపేట్‌కు చెందిన యువకుడు పవన్‌ స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం బాలికను ప్రేమపేరుతో నమ్మించి కారులో హైదరాబాద్‌ తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.

అనంతరం తన వద్ద ఉన్న బాలిక ఫొటోలను చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ అత్యాచారం చేసే యత్నం చేశాడు. దీంతో బాధితురాలు కుటుంబీకులతో కలసి నవంబర్‌ 8న తాండూరు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అయితే కొందరు రాజీకి యత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో వారం తర్వాత బాధితురాలు తాండూరు డీఎస్పీని ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు మరో ఇద్దరు బాలికలను కూడా వేధించాడని సమాచారం. బాలికపై అత్యాచారం జరిగినా కేసు నమోదులో జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

>
మరిన్ని వార్తలు