వాహనం ఢీకొని మెదక్ జిల్లావాసి దుర్మరణం

30 Nov, 2014 22:52 IST|Sakshi
వాహనం ఢీకొని మెదక్ జిల్లావాసి దుర్మరణం

శంకర్‌పల్లి(రంగారెడ్డి జిల్లా): గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో జిల్లావాసితోపాటు మరో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని సింగపూర్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండ లం ఎల్లకొండ గ్రామానికి చెందిన వడ్ల రమేష్(33), సంగారెడ్డి మండలం అల్లూర్ గ్రామానికి చెందిన కమ్మరి శివకుమార్(23) మామాఅల్లుళ్లు.

శనివారం ఉదయం 6 గంటల సమయంలో వీరిద్దరు బైక్‌పై అల్లూర్ నుంచి శంకర్‌పల్లి మీదుగా ఎల్లకొండ గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలోని సింగపూర్ శివారులో ల్యాంకో హిల్స్ రేకులషెడ్ సమీపంలోని మలుపులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రమేష్, శివకుమార్ తలలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. సంగారెడ్డి వైపు వెళ్తున్న వాహనదారుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

కాగా ఉదయం సమయంలో పొగమంచు ఉండడంతో గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టి వెళ్లి పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులిద్దరికి పెళ్లి కాలేదు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఘటనా స్థలంలో వారి రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు