అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

30 Jan, 2019 11:09 IST|Sakshi
గురుమూర్తి (ఫైల్‌)

పెద్దవూర (నాగార్జునసాగర్‌) : దైవదర్శనానికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పర్వేదుల గ్రామానికి చెందిన  వల్లెపు గురుమూర్తి(29), మోహన్, శివలు కలిసి మూడు రోజుల క్రితం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లారు. దర్శనం చేసుకుని సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రైలులో తిరుగుపయనమయ్యారు.

ఈ క్రమంలో గురుమూర్తి తన భార్యకు ఫోన్‌ చేసి మార్గమధ్యలో ముగ్గురి మధ్య గొడవ చోటుచేసుకుందని తెలిపాడు. తదనంతరం అతడి ఫోన్‌ పనిచేయలేదు. ఏమైందో ఎమో తెలియదు కానీ తాడేపల్లిగూడెం సమీపంలోని రైలుపట్టాలపై గురుముర్తి విగతజీవిగా మారాడు. తెల్లవారుజామున అక్కడి రైల్వేపోలీసులు గురుమూర్తి మృతదేహాన్ని గుర్తించారు. అతడి సెల్‌ లాస్ట్‌నంబర్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? మరో కారణం ఏమైనా ఉందా అనే విషయం తెలియరాలేదు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బందువులు తాడేపల్లిగూడెంకు బయలు దేరారు. మృతుడుకి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.కాగా, గురుమూర్తి వెంట వెల్లిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి చేరుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు