ఎడమ చేతి భుజానికి తొమ్మిది కుట్లు

26 Oct, 2018 04:18 IST|Sakshi
సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను పరామర్శించడానికి వచ్చిన వైఎస్‌ విజయమ్మ, రోజా తదితరులు

నిలకడగా జగన్‌ ఆరోగ్యం

24 గంటల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యులు

కత్తిగాటు నుంచి రక్త నమూనాల సేకరణ  

సాక్షి, సిటీబ్యూరో : విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తిపోటుకు గురై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. కత్తిపోటుకు గురైన జగన్‌మోహన్‌రెడ్డి చికిత్స కోసం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరగా డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ శివారెడ్డి, డాక్టర్‌ మధుసూ దన్, డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌లతో కూడిన వైద్య బృందం ఆయనకు సత్వర వైద్య చికిత్సలు అందజేసింది.

తొమ్మిది కుట్లు వేశారు. సుమారు మూడున్నర ఇంచుల లోపలికి కత్తిగాటు పడటంతో రక్తం బాగా పోయింది. కత్తిగాటు గాయం నుంచి సేకరించిన రక్తపు నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించినట్లు వైద్యులు తెలిపారు. దాడిలో ఉపయోగించిన కత్తికి ఏమైనా విషపూరిత రసాయనాలు ఉపయోగించారా? లేదా అనేది రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని వైద్యులు సూచించారు. దీంతో ఆయన గురు వారం రాత్రి పొద్దుపోయే వరకు ఆస్పత్రిలోనే ఉండిపోయారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించేందుకు మాజీ కేంద్ర మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దానం నాగేందర్, పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కె రోజా, శిల్పామోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పరామర్శించారు.  

మరిన్ని వార్తలు