హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో మూడో రోజు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర గురువారం కొనసాగుతోంది. రెహ్మత్ నగర్లో మడత సత్యనారాయణ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్మించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు.
నేటి నుంచి నిజామాబాద్లో పరామర్శ యాత్ర
గ్రేటర్ పరిధిలో రెండు కుటుంబాలను పరామర్శించిన తర్వాత వైఎస్ షర్మిల నిజామాబాద్ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో 19 మంది తనువు చాలించారు. వీరిలో మొదటి విడత పరామర్శ యాత్రలో 12 కుటుంబాలను కలిశారు. రెండో విడతలో భాగంగా గురు, శుక్రవారాల్లో మిగిలిన ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. మొదటిరోజు నాలుగు, మరుసటి రోజు మూడు కుటుంబాలను కలుసుకుంటారు. వైఎస్ కోసం అసువులు బాసిన వారి స్మారకార్థం గాంధారి మండలం పోతంగల్ కలాన్ సమీపంలో శుక్రవారం పైలాన్ను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.