గుట్టలో ‘పొంగులేటి’ పూజలు

15 Mar, 2015 00:04 IST|Sakshi

 యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూలమాలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని ధ్వజ స్తంభం వద్ద ముందుగా నమస్కరించుకుని ఆలయంలోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు.
 
 ఎంపీకి ఘన స్వాగతం
 యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ నాయకులు వడ్లోజు వెంకటేశ్, గూడూరు జైపాల్‌రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొండపైన దేవస్థానం అతిథి గృహంలో స్థానిక  కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. బాగున్నారా అంటూ కార్యకర్తలందరినీ పలకరించారు. అనంతరం ఆయన తన కుటుంబ సమేతంగా కార్యకర్తలతో కలిసి  దర్శనానికి వెళ్లారు.  ఆయనతో కలిసి ఫొటోలు దిగడానికి కార్యకర్తలు పోటీ పడ్డారు.
 
 అర్చకులతో కాసేపు..
 స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ అర్చకులతో కలిసి మాట్లాడారు. వారందరినీ  ఆప్యాయంగా పలకరించారు. అర్చకుల బాగోగులు, వేతనాల విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. గుట్ట ఆలయ అభివృద్ధిపై ఆరా తీశారు. క్షేత్ర మహాత్యం, పూజల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నల్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, గూడూరు జైపాల్‌రెడ్డి, వడ్లోజు వెంకటేశ్, సాధు రమేశ్‌రెడ్డి, నేలకొండపల్లి మండలాధ్యక్షుడు కోటి సైదిరెడ్డి, చెన్న రాజేశ్, హరిప్రసాద్, బట్టు సతీష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు