నేడు కొలువుదీరనున్న జెడ్పీ స్థాయీ సంఘాలు
జెడ్పీటీసీలు, కోఆప్షన్లతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యే కూడా సభ్యులే
అన్ని సంఘాలకు మహిళా జెడ్పీటీసీలే అధ్యక్షులుగా ఉండే అవకాశం
సాక్షి, భూపాలపల్లి: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. జిల్లాలోని సమస్యలను ఆ శాఖల అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు జిల్లా పరిషత్కు స్థాయి సంఘాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అటువంటి స్థాయీసంఘాలకు నేడు సభ్యుల ఎన్నిక జరగబోతోంది. దీని కోసం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సభ్యులు సమావేశం కాబోతున్నారు.
దీంతో అన్ని మండలాల జెడ్పీటీసీలతో సహా, కోఆప్షన్ మెంబర్లు, జిల్లాతో సంబంధం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆహ్వాన లేఖలు అందాయి. స్థాయీ సంఘాల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం వారం క్రితమే ప్రతీ జెడ్పీటీసీ సభ్యుడికి అధికారులు తెలియజేశారు. జిల్లాలో జెడ్పీ చైర్మన్తో కలిపి మొత్తం 11 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు కోఆప్షన్ మెంబర్లతో పాటు జిల్లాకు సంబంధం ఉన్న ములుగు, భూపాలపల్లి, మంథని ఎమ్మెల్యేలతో పాటు వరంగల్ మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులతో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు.
స్టాండింగ్ కమిటీల కూర్పు
జిల్లా పరిషత్ పాలనలో కీలకమైనవి స్థాయిసంఘాలు. ప్రతీ జిల్లా పరిషత్లో 7 సాయీ సంఘాలు ఉంటాయి. ఇందులో 1. ఆర్థికం ప్రణాళిక , 2. పనుల స్టాండింగ్ కమిటీ, 3. గ్రామీణాభివృద్ధి , 4. విద్యా వైద్యం ఈ నాలుగు స్థాయిసంఘాలకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షురాలిగా వ్యవహరి స్తారు. 5. వ్యవసాయ స్టాండింగ్ కమిటీకి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తా రు. 6. మహిళా స్త్రీ శిశు సంక్షేమ కమిటీకి, 7. సాంఘిక సంక్షేమ స్థాయిసంఘానికి మహిళా జెడ్పీటీసీలు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం జిల్లాలో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ మహిళలే కావడంతో జిల్లాలోని ప్రతీ స్థాయీ సంఘానికి మహిళలే అ«ధ్యక్షురాలిగా ఉండనున్నారు.
గ్రామీణాభివృద్ధి, విద్యా, వైద్య కమిటీలకు డిమాండ్
జిల్లా పరిషత్లో ఏడు స్టాండింగ్ కమిటీలు ఉన్నా రెండింటికి మాత్రమే ఫుల్ డిమాండ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి, విద్యావైద్యానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉండేందుకే జెడ్పీటీసీలు, ఇతర సభ్యులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈరెండింటాì ఎక్కువగా సమీక్షించే అవకాశం ఉండటం కూడా డిమాండ్కు కారణంగా ఉంది.
స్థాయీ సంఘాల ఎన్నికకు సంబధించిన నియమాలు
ఉన్న సభ్యులతోనే సర్దుబాటు
మొత్తం జెడ్పీ చైర్మన్తో సహా 19 మంది సభ్యులు 7 సాయీ సంఘాల్లో సభ్యులుగా ఉండనున్నారు. హోదారీత్యా జెడ్పీచైర్మన్ అన్ని స్థాయీ సంఘాల్లో సభ్యురాలిగా ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ సంఘాల్లో సభ్యులుగా ఉండేందుకు అవకాశం లేదు. దీంతో పాలకపక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఏదో ఒక కమిటీలో చోటు దక్కనుంది. సభ్యులు తక్కువగా ఉండటంతో జెడ్పీచైర్మన్తో కలిపి కొన్ని స్థాయిసంఘాల్లో నలుగురు, కొన్నింటిలో ముగ్గురు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే 7 కమిటీల్లో నాలుగు కమిటీల్లో జెడ్పీ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు మొత్తంగా నలుగురు సభ్యులు ఉంటే, మూడు స్థాయీ సంఘాల్లో జెడ్పీ చైర్మన్, మరో ఇద్దరు సభ్యులు మొత్తంగా ముగ్గురు సభ్యులు ఉండే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్ వారు కాగా, నలుగురు కాంగ్రెస్, ఒక్కరు ఏఐఎఫ్బీ నుంచి ఉన్నారు.