7 జోన్లుగా తెలంగాణ

24 May, 2018 16:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతిభవన్‌లో గురువారం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు ప్రయోజనాలు, గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్‌ వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలియజేయడంతో పాటు ఇతర అంశాలు చర్చించడానికి శుక్రవారం టీజీవో భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సమావేశం తర్వాత వారి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్ పంపుతారు. దీనిపై కేబినెట్ సమావేశం జరుగుతుంది. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే కేంద్రానికి పంపుతారు. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి, తెలంగాణలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి తెచ్చేలా చేస్తానని కేసీఆర్‌ తెలిపారు. 

ప్రతిపాదిత జోన్లు
కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా): భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి
బాసర జోన్ (39.74 లక్షల జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా): కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా): సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ
చార్మినార్ జోన్ (1.03 కోట్ల జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా): మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్

ప్రతిపాదిత మల్టీ జోన్లు
కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి (1.61 కోట్ల జనాభా)
యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా)
 

మరిన్ని వార్తలు