క్షణ క్షణం.. ఉత్కంఠ భరితం

14 May, 2014 04:12 IST|Sakshi

 డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని బర్ధిపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మంగళవా రం నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 14 మండలాల(డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, నిజామాబాద్, నవీపేట, నంది పేట, మాక్లూర్, ఆర్మూర్, వేల్పూర్, బాల్కొం డ, కమ్మర్‌పల్లి , మోర్తాడ్,భీమ్‌గల్)కు సంబంధించిన ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 5గంట లకు ముగిసింది.

ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను  వేరు చేసి బండిల్స్ కట్టి వేరు వేరు బాక్సుల్లో పెట్టారు. జడ్పీటీసీ ఓట్ల బండిల్స్‌ను డ్రమ్ములో వేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ కోసం 11 టేబుళ్లు, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కోసం 11 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా బండిల్స్‌గా కట్టిన ఓట్లను పార్టీ గుర్తుల వారీగా కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తూ బాక్సుల్లో ఉంచారు. అనంతరం పార్టీల వారీగా ఓట్లను లెక్కించి పోలైన ఓట్లలో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు  విజేతలుగా ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

 కూలిన టెంటు.. తప్పిన ప్రమాదం..
 ఉదయం  కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఎన్నికల సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బందికి అల్పాహారం ఏర్పాటు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు కొందరు ఉదయం 8.30 గంటల సమయంలో టెంటు కింద కూర్చుని అల్పాహారం చేస్తుండగా ఒక్కసారిగా వీచిన గాలులకు టెంటు కుప్పకూలింది. దీంతో టెంటు కింద ఇరుక్కున్న పోలీసులు టెంటును పెకైత్తుకుని బయటకు వచ్చారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.

 కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన  రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు
 కౌంటింగ్ కేంద్రాన్ని  రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు డాక్టర్ టీకే శ్రీదేవి సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ తరుణ్‌జోషిలు కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి కౌంటింగ్ తీరును పరిశీలించారు. అలాగే  డీపీవో సురేశ్‌బాబు, జడ్పీ సీఈవో రాజారాంతో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఐకేపీ పీడీ వెంకటేశం కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి కౌంటింగ్ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించి, ఎన్నికల అధికారులకు సూచనలు ఇచ్చారు.

 టెన్షన్.. టెన్షన్..
 కౌంటింగ్ ప్రారంభమైన నుంచి అభ్యర్థులు టెన్షన్‌లో మునిగిపోయారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నకొద్ది ఆధిక్యం పెరిగిన అభ్యర్థులు, వారి తరపు ఏజెంట్లు ఆనందంలో మునిగిపోగా, ఓట్లు తక్కువగా వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్లు నిరాశలో మునిగిపోయారు. ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చే రుకునే సరికి ప్రత్యర్థి చేతిలో ఓటమి తప్పదని తేలిన అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు