హాస్యం లేని చిత్రం ఉప్పులేని కూరవంటిది

6 Jan, 2018 11:35 IST|Sakshi
శ్రీవారి ఆలయ వీఐపీ లాంజ్‌లో కుటుంబ సమేతంగా రాజేంద్రప్రసాద్‌

సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌

ద్వారకాతిరుమల : కుటుంబ నేపథ్యంతో పాటు, సమాజానికి మంచి మెసేజ్‌ ఇచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శుక్రవారం రాత్రి ఆయన సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనస్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు.

అనంతరం రాజేంద్రప్రసాద్‌ విలేకర్లతో మాట్లాడుతూ సినిమాల్లో హాస్యం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. హాస్యం లేని చిత్రం ఉప్పులేని కూరవంటిదని అన్నారు. ఇటీవల విడుదలైన తాను నటించిన రాజ ది గ్రేట్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నారు. సమాజానికి ఎంతో విలువైన మెసేజ్‌ ఇచ్చిన ఆ నలుగురు వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నాన్ని చేస్తున్నానని ఆయన అన్నారు. తనకు చినవెంకన్న ఇష్టదైవమని, అందుకే కుటుంబ సమేతంగా వచ్చానన్నారు.

మరిన్ని వార్తలు