వధువు బంధువునంటూ నగలతో ఉడాయింపు

3 Apr, 2017 21:13 IST|Sakshi
వధువు బంధువునంటూ నగలతో ఉడాయింపు

నరసరావుపేటటౌన్(గుంటూరు): పెళ్లిలో వధువు బంధువునంటూ చెప్పి బంగారు అభరణాల బ్యాగుతో ఉడాయించాడు. నరసరావుపేటలోని ఓ ప్రముఖ వైద్యుడి కుమార్తె వివాహ వేడుకలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగుచూసింది. టూటౌన్‌ పోలీసులు వివరాల మేరకు..

పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు చేకూరి కోటేశ్వరరావు కుమార్తె వివాహం గత శనివారం సాయంత్రం జమిందార్‌ కళ్యాణ మండపంలో నిర్వహించారు.  ఓ అజ్ఞాత వ్యక్తి వధువు తరపు బంధువునని చెప్పి మగ పెళ్లి వారి వద్ద నుంచి సుమారు రూ.15లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులతో ఉన్న బ్యాగ్‌ను వాహనంలో పెడతానని తీసుకొని ఉడాయించాడు. పెళ్లి హడావిడిలో ఉన్న రెండు కుటుంబాల వారు కొన్ని గంటల తరువాత అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు