దర్గాలో అరాచకం.. 20మంది మృతి!

2 Apr, 2017 15:45 IST|Sakshi
దర్గాలో అరాచకం.. 20మంది మృతి!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని ప్రఖ్యాత సూఫీ దర్గాలో అమానుష హింసాకాండ చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని, సైకో దర్గా పెద్ద కత్తులతో విరుచుకుపడి 20మంది భక్తులను పొట్టనబెట్టుకున్నాడు. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. నలుగురు మహిళలు ఉన్నారు. ఈ అరాచక ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.

పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని మహహ్మద్‌ లీ గుజ్జర్‌ సూఫీ దర్గాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల దర్గా సంరక్షకుడు అబ్దుల్‌ వాహీద్‌ తానే ఈ దుర్మార్గానికి పాల్పడ్డానని, తనను చంపేందుకు వచ్చినవారిగా పొరపాడి వారిపై తాను కత్తులతో దాడి చేసినట్టు నేరాన్ని అంగీకరించాడని  ప్రాంతీయ పోలీసు చీఫ్‌ జుల్ఫికర్‌ హమీద్‌ మీడియాకు తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని, సైకో తరహాలో వ్యవహరించి ఈ హత్యకాండకు దిగాడని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనలో మరికొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నామని, కుటుంబ తగాదాల కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు