మోదీ ఇలాకాలో భారీగా నకిలీ నోట్లు

6 Apr, 2017 09:44 IST|Sakshi
మోదీ ఇలాకాలో భారీగా నకిలీ నోట్లు

న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెలికితీయడంతో పాటు నకిలీ కరెన్సీని అరికట్టాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి, వీటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నకిలీ 2 వేలు, 500 రూపాయల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు ఎక్కువగా ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో వెలుగు చూశాయి.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు దేశ వ్యాప్తంగా 28 వేల నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలియజేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా 6.20 కోట్ల రూపాయల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్‌ దళాలు 7.56 లక్షల రూపాయల విలువైన 378 నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 22,677 నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకోగా.. వీటిలో 22,479 నకిలీ నోట్లను గుజరాత్‌లోనే స్వాధీనం చేసుకుంది. ఇక గుజరాత్‌ పోలీసులు 4251 నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 95 శాతం నకిలీ 2 వేల రూపాయల నోట్లను గుజరాత్‌లోనే స్వాధీనం చేసుకున్నారు. ఇక 10 రాష్ట్రాల్లో 12,956 నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకోగా, గుజరాత్‌లోనే 8,720 నకిలీ నోట్లు వెలుగు చూశాయి.

>
మరిన్ని వార్తలు