ఔను.. తొలిసారి అంగీకరించిన హోంమంత్రి!

8 Jun, 2017 14:02 IST|Sakshi
ఔను.. తొలిసారి అంగీకరించిన హోంమంత్రి!

భోపాల్‌: పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయిన ఘటనపై ఇన్నిరోజులు బుకాయిస్తూ వచ్చిన మధ్యప్రదేశ్‌ హోంమంత్రి భూపేంద్రసింగ్‌ ఎట్టకేలకు తొలిసారి నిజం అంగీకరించారు! పోలీసుల కాల్పుల వల్లే మంద్‌సౌర్‌లో ఐదుగురు రైతులు చనిపోయారంటూ తొలిసారి ఆయన మీడియా ముఖంగా అంగీకరించారు. ‘పోలీసుల కాల్పుల వల్ల ఐదుగురు రైతులు చనిపోయారు. దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. నేను గతంలో కూడా ఇదే చెప్పాను. కొన్ని మీడియా చానెళ్లలో వచ్చింది కూడా’ అని ఆయన చెప్పుకొచ్చారు.

పోలీసుల కాల్పుల వల్లే రైతులు చనిపోయారన్న వాదనను గతంలో భూపేంద్రసింగ్‌ తిరస్కరించారు. రైతుల ఆందోళనలోకి సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించి.. ప్రజలు లక్ష్యంగా కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లోనే రైతులు  చనిపోయారని ఆయన చెప్పుకొచ్చారు. మంద్‌సౌర్‌లో రైతులను పరామర్శించడానికి రాహుల్‌గాంధీ రావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం అంగీకరించిందని, ఇంకా రాహుల్‌ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు