పాకిస్థాన్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లోని హోం మంత్రి కార్యాలయంలో ఆదివారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. హోం మంత్రి షుజా ఖాన్జాదాతోపాటు మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ పేలుడు దాటికి కార్యాలయంలోని పైకప్పు కుప్పకూలడంతో వీరంత గాయపడినట్లు మీడియా వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆత్మాహుతి దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కానీ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు మాత్రం ధృవీకరించడం లేదు.
అయితే గతేడాది ఆక్టోబర్లో షుజా హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తీవ్రవాదులు, వారి సంస్థలపై షుజా ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.