హిప్నటైజ్ చేసి నిద్రలోకి పంపి, ‘జీవ సమాధి’

27 Feb, 2014 09:59 IST|Sakshi
హిప్నటైజ్ చేసి నిద్రలోకి పంపి, ‘జీవ సమాధి’

*బాలిక సజీవ దహనానికి యత్నం
 *చివరి క్షణంలో అడ్డుకున్న అధికారులు
 *దొంగ స్వామి, శిష్యుడి అరెస్ట్
 *21 రోజులుగా ‘జీవసమాధి’లో బాధితురాలు
 
 బెంగళూరు, న్యూస్‌లైన్: ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ఓ దొంగ స్వామీజీ పేట్రేగిపోయాడు. అభం శుభం తెలియని బాలికను సజీవ దహనం చేయడానికి యత్నించి చివరి క్షణంలో పోలీసులకు దొరికిపోయాడు. కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో మంగళవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది.
 
 సజీవంగా తిరిగి వస్తుందని..
 జిల్లాలోని అథణికి చెందిన చెన్నప్ప, కస్తూరి దంపతులకు చిక్క నంజమ్మదేవి(7), రాధిక అనే పిల్లలు ఉన్నారు. జుంజరవాడ మఠాధిపతి అయ్యప్పస్వామికి భక్తులైన వీరు తమ పిల్లలను అతనికి దత్తత ఇచ్చారు.ప్రజల్లో మరింత పేరు సంపాదించేందుకు అయ్యప్ప ఎత్తులు వేసేవాడు. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న నంజమ్మదేవిని 21 రోజుల కిందట హిప్నటైజ్ చేసి నిద్రలోకి పంపి, ‘జీవ సమాధి’ చేశాడు. మంగళవారం రాత్రి ఆ చిన్నారిని సజీవ దహనం చేస్తానని, శివరాత్రి రోజున ఆమె మళ్లీ సజీవంగా వస్తుందని కరపత్రాలతో ప్రచారం చేయించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులు మంగళవారం రాత్రి మఠానికి చేరుకున్నారు. అప్పటికే బాలిక ఉన్న సమాధిపై ఐదు టన్నుల కట్టెలు పేర్చి, పెట్రోల్ చల్లి నిప్పంటించేందుకు సిద్ధంగా ఉన్న అయ్యప్పను, అతని శిష్యుడుచిక్కప్పయ్యను అదుపులోకి తీసుకున్నా రు. రెండు గంటలపాటు శ్రమించి సమాధి నుంచి బాలికను బయటకు తెచ్చారు. 21 రోజులుగా సరైన గాలి, ఆహారం లేక చిన్నారి శరీరం నల్లబారింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిర్బంధంలో ఉన్న మరో నలుగురు బాలురను కాపాడారు.
 
 రాత్రి బయటకు తెచ్చి.. : నంజమ్మదేవిని అయ్యప్ప రాత్రి పూట సమాధి నుంచి బయటకు తీసి,ఆహారం తినిపించాక తిరిగి అందులోకి పంపేవాడని తెలుస్తోంది. బాలికకు గాలి అందడానికి ఓ పైపును ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా, బాధితురాలు ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు చెప్పారు. అయ్యప్ప లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని గతంలో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జిల్లా అధికారి కార్యాలయంలో పోలీసులు అతణ్ని విచారించారు. ఆ సమయంలో అతడు తనకు అసలు పురుషాంగమే లేదంటూ బట్టలు విప్పి హల్‌చల్ చేశాడు.
 

మరిన్ని వార్తలు