పూలు కోస్తూ విద్యుద్ఘాతంతో విద్యార్థిని మృతి

9 Aug, 2015 22:24 IST|Sakshi

మాచారెడ్డి (నిజామాబాద్): పూజుకు పువ్వులు కోస్తున్న విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఎల్పుగొండలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్పుగొండ గ్రామానికి చెందిన ఐలేని పూజ (18) కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. సెలవు కావడంతో ఆదివారం ఇంటి వద్దే ఉంది.

ఉదయం పూజ కోసం మల్లెపూలను తెంపుతుండగా... పక్కనే ఉన్న విద్యుత్ సర్వీస్ వైరు ఆమెను తాకింది. దానికి విద్యుత్ ప్రసారం కావడంతో షాక్‌కు గురై కేకలు వేసింది. కుమార్తెను కాపాడేందుకు వచ్చిన తల్లి రజిత కూడా విద్యుత్ ఘాతానికి గురైంది. స్థానికులు కర్రతో మల్లెతీగను కొట్టడంతో రజిత ప్రాణాలతో బయటపడింది. పూజ మాత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

మరిన్ని వార్తలు