పరీక్ష కేంద్రం వద్ద యువతిపై కత్తితో దాడి

25 Nov, 2013 03:38 IST|Sakshi

అనంతపురం, న్యూస్‌లైన్: తనతో స్నేహంగా ఉన్న యువతి, మరో వ్యక్తిని వివాహం చేసుకుందని ఆగ్రహించిన ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం  చేశాడు. ఈసంఘటన అనంతపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం కోటంకకు చెందిన సునీల్ రెడ్డి, నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన యువతి స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో స్నేహంగా ఉండేవారు.
 
 అనంతరం ఉన్నత చదువుల కోసం సునీల్ వైఎస్సార్ జిల్లా యోగివేమన యూనివర్సిటీలో చేరగా, ఆ యువతి స్థానిక ఎస్వీ పీజీ కళాశాలలో చేరింది. సునీల్ ఆదివారం స్థానిక ఆర్ట్స్ కాలేజీలో ఏపీసెట్ పరీక్షలు రాస్తూ అదే గదిలో ఆ యువతిని చూశాడు. ఆమెకు వివాహమైనట్లు గుర్తించాడు.పరీక్ష రాసి కళాశాల ఆవరణలో ఉన్న యువతి వద్దకు వెళ్లి, తనను మోసం చేసి, మరొకరిని వివాహం చేసుకుంటావా? అంటూ కత్తితో దాడి చేశాడు. గాయపడిన ఆమె ప్రాణ భయంతో కళాశాల ఆవరణ నుంచి బయటకు పరుగెత్తి ఆటోలో వెళ్లిపోయింది. దాడి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన సనీల్‌రెడ్డి కక్కలపల్లి క్రాస్ సమీపంలోని ఓ తోటలో విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

మరిన్ని వార్తలు