అవినీతిని పట్టించుకోరా.. ఇదిగో చెంపదెబ్బ!

3 Apr, 2017 12:26 IST|Sakshi
అవినీతిని పట్టించుకోరా.. ఇదిగో చెంపదెబ్బ!

ఢిల్లీలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని పార్టీలలో ప్రకంపనలు రేపుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో అవినీతి పెరిగిపోతోందని.. అయితే ఆ విషయాన్ని ప్రస్తావించేందుకు తనకు అవకాశం రావట్లేదని ఆగ్రహం చెందిన ఓ మహిళ.. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్‌ను లాగి లెంపమీద కొట్టారు. సిమ్రన్ బేడీ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్త. తాను చెప్పే విషయాలను వినిపించుకోడానికి కూడా ఆయన నిరాకరించడం వల్లే చెంపదెబ్బ కొట్టానని ఆమె అన్నారు. సిమ్రన్ బేడీ ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, టికెట్ అడిగితే తననున డబ్బులు అడిగారని అంటున్నారు.  రాజౌరి గార్డెన్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంజయ్ సింగ్ ప్రచారం చేస్తుండగా ఆయన మీద ఈ దాడి జరిగింది.

పార్టీలో పెరిగిపోతున్న అవినీతి గురించి ప్రస్తావించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశానని, వాటిని వినిపించుకోకపోవడం వల్లే ఆయనను కొట్టానని సిమ్రన్ అన్నారు. తాను అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ లాంటి అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నించానని, కానీ ఏ ఒక్కరూ తన మాట వినిపించుకోలేదని చెప్పారు. ఆప్ నాయకులు టికెట్ కావాలంటే డబ్బులు అడుగుతున్నట్లు ఓ వీడియో కూడా ప్రచారంలోకి వచ్చింది గానీ, దాన్ని పార్టీ నాయకులు ఖండించారు. ఈ ఘటన చాలా సిగ్గుచేటైనదని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆప్ ఢిల్లీ కన్వీనర్ దిలీప్ పాండే అన్నారు. రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలలో ఆప్ విజయాన్ని ఇలాంటి దాడులు ఆపలేవని చెప్పారు. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఆప్ సభ్యుడు జర్నైల్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు