ఓటమి భయం.. నంద్యాలలో బోగస్‌ ఓట్ల కలకలం!

29 Jul, 2017 23:49 IST|Sakshi
ఓటమి భయం.. నంద్యాలలో బోగస్‌ ఓట్ల కలకలం!

- భారీగా బోగస్‌ ఓట్ల సృష్టికి టీడీపీ యత్నం
- కుట్రను పసిగట్టి, ఈసీకి ఫిర్యాదుచేసిన వైఎస్సార్‌సీపీ
- ఎలక్టోరల్‌ అధికారికి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ


అమరావతి:
నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ఖాయం కావడంతో అధికార తెలుగుదేశం పార్టీ భారీ అక్రమాలకు తెరలేపింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 10 వేల పై చిలుకు బోగస్‌ ఓట్లను సృష్టించే యత్నచేసింది.  ఒకే ఐపీ అడ్రస్‌ నుంచి వేల సంఖ్యలో అప్లికేషన్లు వైనాన్ని ఎన్నికల కమిషన్‌ సైతం గర్హించింది.

టీడీపీ కుట్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎలక్టోరల్‌ అధికారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం ఒక లేఖరాశారు. బోగస్‌ ఓట్ల సృష్టికి సంబంధించిన వివరాలను సైతం లేఖకు జతచేశారు. ఇదే అంశంపై వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా కన్వీనర్‌ గౌరు వెంకటరెడ్డి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌కు ఫిర్యాదుచేసిన విషయాన్ని సైతం విజసాయిరెడ్డి గుర్తుచేశారు.

వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల కమిషన్‌.. విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది నంద్యాల పట్టణంలోని ఇంటర్నెట్‌ సెంటర్‌లో తనిఖీలు చేశారు. అధికార పార్టీ కుటిల ప్రయత్నానికి కొందరు అధికారులు కూడా సహకరించినట్లు, అలాంటివారిపై ఈసీ కన్నేసినట్లు సమాచారం.

ఒక్క జులై లోనే 11,500 అప్లికేషన్లు!
18 ఏళ్లు నిండి, దరఖాస్తు చేసుకునే పౌరులందరికీ ఎన్నికల సంఘం ఓటు హక్కుకల్పించడం సర్వసాధారణం. ఆయా నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నదే. అయితే నంద్యాల నియోజకవర్గం విషయానికి వచ్చే సరికి లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఈ ఏడాది జనవరిలో నంద్యాల నియోజకవర్గం నుంచి 1004 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో 525 మంది, మార్చిలో 610 మంది, ఏప్రిల్‌లో 694 మంది, మేలో 1038 మంది, జూన్‌లో 735 మంది కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. కాగా, జులైలో(1 నుంచి 28వ తేదీ వరకు) మాత్రం ఏకంగా 11,502 దరఖాస్తులు రావడం గమనార్హం.

ఒకే ఐపీ నుంచి 4.5వేలా?
నంద్యాలలో పట్టణంలోని ఓ ఇంటర్నెట్‌ సెంటర్‌ ద్వారా, ఒకే ఐపీ అడ్రస్‌ నుంచి ఏకంగా 4.5వేల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నెట్‌ సెంటర్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. బోగస్‌ ఓటర్లను చేర్పించే ప్రక్రియ మొత్తం టీడీపీ ఆధ్వర్యంలోనే జరిగినట్లు వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరింది.

మరిన్ని వార్తలు