రెండు వారాల్లోగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు వేతనాలు

1 Sep, 2015 04:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల వేతనాలను రెండు వారాల్లోగా మంజూరు చేస్తామని సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మానవ వనరుల అభివృద్ధి శాఖ తరుఫున మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో 6230 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా పని చేస్తున్నారని వీరికి ఇప్పటి వరకు రూ. 6.33 కోట్ల వేతనాలు మంజూరు చేయగా మిగిలిన రూ. 14.82 కోట్లు విడుదల చేయాలన్న ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపామన్నారు.  విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచే ప్రతిపాదన ఉందా అని వైఎస్సార్‌సీపీ సభ్యుడు మేకా శేషుబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూఇప్పట్లో పెంచే ఆలోచన లేదన్నారు.
 
తాగునీటి సరఫరాలో భారీ అవినీతి.. మామూలేనన్న మంత్రి యనమల
తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా చేస్తున్న నీటి సరఫరాలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకోవడం వల్ల.. ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు లబ్ది పొందుతున్నారు తప్ప ప్రజలకు ప్రయోజనం కలగడం లేదని వీటిపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం ఇస్తూ అందుకు చర్యలు తీసుకుంటామనే హామీ ఇవ్వకుండా.. అన్ని చోట్లా అవినీతి ఉన్నట్లే సరఫరాలో కూడా అవినీతి జరుగుతోందన్నారు.
 
541 డాక్టర్ పోస్టుల భర్తీ: కామినేని

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 541 డాక్టర్ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ రాష్ట్రంలో 149 పీహెచ్‌సీల నిర్మాణానికి 13వ ఆర్థిక సంఘం నుంచి రూ. 129.76 కోట్లు ఖర్చు చేసి ఇప్పటి వరకు 89 పీహెచ్‌సీల నిర్మాణం పూర్తి చేశామన్నారు.

మరిన్ని వార్తలు