ప్రియాంక చోప్రా కజిన్ సోదరిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన పరిణీత చోప్రా అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న పరిణీత చోప్రా గురించి బాలీవుడ్లో వదంతులకు లోటు లేదు. ఆమె గతంలో దర్శకుడు మనీష్ శర్మతో డేటింగ్ చేసినట్టు రూమర్స్ గుప్పుమన్నాయి. మనీష్ శర్మ తెరకెక్కించిన లేడిస్ వర్సెస్ రికీ బల్, శుద్ధ దేశీ రొమాన్స్ సినిమాల్లో పరిణీత తళుక్కమంది. ఆ తర్వాత మనీశ్తో బ్రేకప్ అయిందని, ఆ డిప్రెషన్లో బరువు పెరిగిందని, కానీ, మళ్లీ తనకు తానే స్ఫూర్తి తెచ్చుకొని.. ఫిట్గా, స్లిమ్గా తయారైందని ఇలా రకరకాల కథనాలు వచ్చాయి.
ఇప్పుడా కథనాలు పక్కనపెడితే ‘ఫిలింఫేర్’ మ్యాగజీన్ తాజాగా ప్రచురించిన ఓ రూమర్ మాత్రం హల్చల్ చేస్తోంది. అదేమిటంటే పరిణీత చోప్రా మళ్లీ ప్రేమలో పడిందట. ఈసారి ఓ అసిస్టెంట్ డైరెక్టర్తో ఆమె ప్రేమలో మునిగిపోయిందని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ప్రస్తుతం ఆ అసిస్టెంట్ డైరెక్టర్తో ఈ అమ్మడు రహస్యంగా చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నదని, తమ రిలేషన్షిప్ గురించి ఇప్పుడే మీడియాకు తెలియకుండా వివరాలు గోప్యంగా ఉంచుతున్నదని ఆ మ్యాగజీన్ చెప్పుకొచ్చింది.
ఈ రూమర్స్ సంగతి ఎలా ఉన్నా.. పరిణీతి మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా సరసన ‘మేరి ప్యారీ బిందు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తొలిసారి గొంతు సవరించుకొని పాట కూడా పాడింది. అంతేకాకుండా రోహిత్ శెట్టీ ‘గోల్మాల్’ సిరీస్లోనూ అజయ్ దేవ్గణ్ సరసన నటిస్తోంది.