ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ తర్వాత మరో దేశీయ అగ్రగామి హెచ్సీఎల్ టెక్ కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. షేర్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించేందుకు సిద్ధమైంది. షేర్ బైబ్యాక్ ప్రకటించాలని కంపెనీ యోచిస్తోందని, ఈ విషయాన్ని బోర్డు ముందుకు తీసుకురాబోతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. రెండు రోజుల క్రితమే టీసీఎస్ రూ.16వేల కోట్ల మెగా షేర్ల బైబ్యాక్ను చేపట్టనున్నట్టు ప్రకటించి, ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం తాము కూడా ఇన్వెస్టర్ల వాల్యు పెంచేందుకు చూస్తున్నామని, షేర్ బైబ్యాకుకు పిలుపునివ్వబోతున్నామని ఓ అధికారి చెప్పారు.
ఒక్కసారి ఈ విషయంపై తాము ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక, బోర్డు ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు. బోర్డు ముందుకు వెళ్లిన తర్వాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ హోల్డర్స్ దీన్ని ఆమోదించాల్సి ఉంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.2,214.5 కోట్లు ఉన్నాయి. అంతేకాక ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10,506.9 కోట్లున్నాయి. టీసీఎస్ తరహాలో మెగా బైబ్యాక్ ఆఫర్ చేయకపోయినా.. బైబ్యాక్ మాత్రం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.