రుతుస్రావంపై పోస్టు చేసిన హీరో!

28 May, 2017 20:39 IST|Sakshi
రుతుస్రావంపై పోస్టు చేసిన హీరో!

మహిళల రుతుస్రావంపై సమాజంలో అనేక మూఢనమ్మకాలు, దుష్ప్రచారాలు ఉన్నాయి. మహిళల పిరియడ్స్‌ గురించి మాట్లాడటమే తప్పు, ఈ విషయాన్ని గుప్తంగా ఉంచాలి అన్నంతగా ఈ మూఢనమ్మకాలు ప్రబలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై క్రమంగా మార్పు వస్తున్నది. అయితే, ఈ అంశం గురించి ఇప్పటికీ సమాజంలో పలు దురభిప్రాయాలు లేకపోలేదు. పిరియడ్స్ గురించి మాట్లాడలంటే 'ఆ రోజుల్లో' అని మాట్లాడే పరిస్థితి ఇప్పటికీ ఉంది.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు 'టు బ్లీడ్‌ వితౌట్‌ వాయిలెన్స్‌' పేరిట అరణ్య జోహర్‌ ఓ పవర్‌ఫుల్‌ కవితను చదివి వినిపించారు. పిరియడ్స్‌ను బలహీనతకు సంకేతంగానో, రహస్య అంశంగానో చూడకూడదని, మహిళ సాధికారితలో ఇది కూడా భాగంగా పరిగణించి.. వారిని ప్రోత్సహించాలంటూ ఆమె పఠించిన ఈ కవితను బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేసుకున్నారు. రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై మౌనాన్ని వీడాలంటూ ఆయన ట్వీట్‌ చేశారు. అక్షయ్‌ తన రాబోవు చిత్రంలో ప్యాడ్‌మన్‌గా కనిపించబోతున్నాడు. తన గ్రామంలోని మహిళలకు తక్కువ ధరకు సానిటరీ ప్యాడ్స్‌ అందించడం ద్వారా సమాజంలో అవగాహన కల్పించిన అరుణాచలం మురుగనాథమ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

మరిన్ని వార్తలు