మంచి ఈవీఎంలు లేకుంటే...

14 Apr, 2017 08:56 IST|Sakshi

లక్నో: మెరుగ్గా పనిచేసే ఈవీఎం యంత్రాలు అందుబాటులో లేనట్లయితే యూపీలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్‌ విధానాన్ని అనుమతించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు తాను గురువారం ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నసీం జైదీతో మాట్లాడానని యూపీ ఎన్నికల కమిషనర్‌ ఎస్కే అగర్వాల్‌ తెలిపారు. ఈ విషయంలో ఈసీ నుంచి బదులు కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

పట్టణ స్థానిక ఎన్నికల్లో వినియోగించబోయే ఈవీఎంలు 2006 నాటి కన్నా ముందువని, కాలం చెల్లిపోవడంతో ఈసీ వాటిని పక్కన పెట్టిందని పేర్కొన్నారు. ఆ ఈవీఎంలు పనికి రానివని తెలిసినా తమకు ఎందుకు ఇస్తున్నారని జైదీని అడిగినట్లు చెప్పారు. ఇది ఎంతో సున్నిత విషయమని, అధునాతన యంత్రా లను సమకూర్చకుంటే బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతిం చాలని ఈసీని కోరామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను జూలై రెండో వారంలోగా పూర్తిచేయాల్సి ఉందని, ప్రస్తుతం వార్డుల పునర్విభజనను యుద్ధ ప్రాతిపదకన చేపడుతున్నామని అగర్వాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు