నేనా.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీనా..?

28 Jul, 2015 21:07 IST|Sakshi
నేనా.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీనా..?

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తరఫున వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీచేస్తారనే వార్తలపై మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య స్పందించారు. తాను టీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, జీవితాంతం సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం రాజయ్య విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వరంగల్ లోక్‌సభా నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమేనని ఆయన అన్నారు.

వరంగల్ ఎంపీ స్థానంలో ఆయన కానీ, ఆయన భార్య కానీ కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ను విడిచి పెట్టడం లేదని, బంగారు తెలంగాణలో భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. తనను కావాలనే కొందరు వివాదాల్లోకి లాగుతున్నారని, ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని డాక్టర్ రాజయ్య వివరించారు.
 

మరిన్ని వార్తలు