వాజపేయి అడిగితే భారతరత్న పురస్కారాన్ని తిరిగిచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ప్రకటించారు. భారతరత్న పురస్కారాన్ని వెనక్కు ఇచ్చేయాలని బీజేపీ ఎంపీ చందన్ మిత్రా చేసిన డిమాండ్పై అమర్త్యసేన్ స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తనకు భారతరత్న ప్రకటించిందని, ఈ అత్యున్నత పురస్కారాన్ని వాజపేయి తనకు ప్రదానం చేశారని ఆయన గుర్తు చేశారు. వాజపేయి కోరితే దీన్ని తిరిగిచ్చేస్తానని 'టైమ్స్ నౌ'తో చెప్పారు.
భారతరత్న వెనక్కి ఇవ్వాలని చందన్ మిత్రా డిమాండ్ చేయడం దురదృష్టకరమని అమర్త్యసేన్ అన్నారు. ఎన్డీఏ హయాంలో బీజేపీ నాయకులు అద్వానీ, యశ్వంత్ సిన్హా, జశ్వంత్ సింగ్, అరుణ్ జైట్లీ వంటి వారితో పలుమార్లు చర్చలు జరిపానని ఆయన వెల్లడించారు.
భారత దేశంలో ఓటరుగా ఉండే హక్కు కూడా అమర్త్యసేన్కు లేదని చందన్ మిత్రా అంతకుముందు విమర్శించారు. భారతరత్న అందుకున్న అమర్త్యసేన్.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతరత్న తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.