చైనా రహస్య చౌర్యం!

16 Nov, 2016 15:17 IST|Sakshi
చైనా రహస్య చౌర్యం!
  • గుట్టుగా స్మార్ట్‌ఫోన్ల నుంచి డాటా దోచేస్తున్న వైనం
  •  
    వాషింగ్టన్‌: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలోని వ్యక్తిగత సున్నితమైన సమాచారం సమస్తం దొంగదారిలో చైనాకు తరలిపోతున్నదని తాజాగా అమెరికాలో గుర్తించారు. స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల అనుమతిలేకుండానే, వారికి తెలియకుండానే గుట్టుగా ఈ వ్యవహారం సాగుతున్నదని, వారి వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని థర్డ్‌పార్టీ సర్వర్లకు గుట్టుగా తరలిస్తున్నారని తాజాగా సాఫ్ట్‌వేర్‌ సెక్యూరిటీ సంస్థ క్రిప్టోవైర్‌ వెల్లడించింది. 
     
    అమెరికాకు చెందిన ప్రధాన ఆన్‌లైన్‌ రిటైర్లయిన అమెజాన్‌, బెస్ట్‌బై మొదలైన వాటిలో అమ్ముతున్న ప్రధాన స్మార్ట్‌ఫోన్ల అన్నింటిలోనూ ఈ చౌర్యం కొనసాగుతున్నదని, బ్లు ఆర్‌ హెడ్‌ వంటి అమెరికా పాపులర్‌ స్మార్ట్‌ఫోన్లలోనూ ఈ సమాచార చౌరీ యథేచ్ఛగా సాగుతున్నదని క్లిఫ్టోవైర్‌ తెలిపింది. 
     
    ఆండ్రాయిడ్‌ పరికరాల్లో ‘కోర్‌ మానిటరింగ్‌ యాక్టివిటిస్‌’ నిర్వహించే మౌలిక ఫార్మ్‌వేర్‌ ఓవర్‌ ద ఎయిర్‌ (ఫోటా) సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌ను చైనాకు చెందిన షాంఘై అడప్స్‌ టెక్నాలజీ కో లిమిటెడ్‌ అందిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ కలిగిన ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఆటోమేటిక్‌గా యూజర్ల టెక్ట్స్ మెసేజ్‌లు, కాంటాక్ట్‌ లిస్ట్‌లు, కాల్‌ హిస్టరీ, పూర్తి టెలిఫోన్‌ నంబర్లు, ఇంటర్నేషనల్‌ మొబైల్‌ సబ్‌స్క్రైబర్‌ ఐడెంటిటీ (ఐఎంఎస్‌ఐ), ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ (ఐఎంఈఐ) వంటి డివైస్‌ గుర్తింపు నంబర్లు సహా సమస్త సమాచారం చైనా సర్వర్లకు రహస్యంగా తరలిపోతున్నది.  

    అడప్స్‌ కంపెనీ తనకు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారని చెప్పుకొంటోంది. 150 దేశాల్లో సేవలు అందిస్తున్న ఈ కంపెనీకి ఆండ్రాయిడ్‌ మార్కెట్‌లో 70శాతం వాటా ఉంది. షాంఘై, షెంఝెన్‌, బీజింగ్‌, టోక్యో, న్యూఢిల్లీ, మియామీ తదితర ప్రధాన నగరాల్లో దీనికి ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. 400లకుపైగా ప్రముఖ మొబైల్‌ ఆపరేటర్లకు, స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు ఇది సేవలు అందిస్తుండటంతో భారత్‌లోని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సమాచార భద్రతపైనా ఆందోళన వ్యక్తమవుతున్నది.  
     
మరిన్ని వార్తలు