టెలికాలర్‌ సునీతది ఆత్మహత్య?

20 Feb, 2017 07:28 IST|Sakshi
టెలికాలర్‌ సునీతది ఆత్మహత్య?

పెళ్లికి నిరాకరించడమే కారణమా!
హైదరాబాద్‌: మాదాపూర్‌ భాగ్యనగర్‌ సొసైటీలో మంటల్లో కాలి చనిపోయిన టెలికాలర్‌ సునీతది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారణకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. పెళ్లికి పట్టుబట్టడంతో గత ఆగస్టు నుంచి సునీతను అతడు దూరంగా పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో వాలెంటైన్స్‌ డే నాడు కలిసేందుకు ప్రియుడు నిరాకరించడంతో సునీత తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: టెలికాలర్‌ దారుణ హత్య)

గచ్చిబౌలిలో టెలికాలర్‌గా పనిచేసే ప్రియుడిని భాగ్యనగర్‌ సొసైటీ రోడ్డులో కలిసేదని, ఈ క్రమంలోనే అక్కడ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యగా పరిగణించేందుకు పూర్తిస్థాయి ఆధారాలు లభించలేదని, సునీత మరణంలో ఇంకెవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యా... ఆత్మహత్యా అన్నది నిర్ధారించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.