చంద్రబాబుకు అంత సీన్‌ లేదు: పద్మశ్రీ

24 Apr, 2017 19:29 IST|Sakshi
చంద్రబాబుకు అంత ధైర్యం లేదు: పద్మశ్రీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు నాయుడు.. నీతి ఆయోగ్‌ సమావేశంలో నిధుల కోసం ప్రాధేయపడటాన్ని దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. గడిచిన మూడేళ్లలో నాలుగు లక్షలమందికిపైగా కూలీలు వలసవెళ్లినా చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సోమవారం విజయవాడలోని పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

'ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈ మధ్య చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చాయి. తప్పుడు మాటలతో పరిపాలన సాగిస్తోన్న ఆయనకు ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమన్న సంగతి అందరికీ తెలిసిందే' అని పద్మశ్రీ అన్నారు. టీడీపీ సర్కారు ప్రాథమిక వైద్య కేంద్రాలను ప్రైవేట్‌ పరం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ధనేకుల మురళీ, మీసాల రాజేశ్వరరావు, నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు