జల్లికట్టు స్ఫూర్తితో ట్రిపుల్ తలాక్ కోసం..

28 Jan, 2017 08:48 IST|Sakshi
జల్లికట్టు స్ఫూర్తితో ట్రిపుల్ తలాక్ కోసం..
తమిళులంతా జల్లికట్టు కావాలని ఒక్కతాటి మీదకు వచ్చి పోరాటం చేసిన స్ఫూర్తితో ముస్లింలు ట్రిపుల్ తలాక్ కోసం పోరాడాలని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. తమిళుల్లాగే ముస్లింలకు కూడా తమ సొంత సంస్కృతి ఒకటి ఉందని, తమిళుల ఉద్యమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తల వంచాల్సి వచ్చినందున ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. తమ పెళ్లిళ్లు, ట్రిపుల్ తలాక్ లాంటి తమ సంప్రదాయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఆయన అన్నారు. 
 
తమిళనాడులో తమ సంప్రదాయం కోసం లక్షలాది మంది నిరసనకు దిగారని, మనం వాళ్లకంటే ఎందులో తక్కువని ప్రశ్నించారు. మనకు కూడా మన సొంత సంస్కృతి ఉందని, మనకు కావల్సి వచ్చినట్లుగానే పెళ్లి చేసుకుని, విడాకులు ఇచ్చుకుంటామని, ఇలాగే చేయాలని ఎవరూ చెప్పడానికి వీల్లేదని ఒవైసీ అన్నారు. ట్రిపుల్ తలాక్ సంస్కృతిని పలు మహిళా సంఘాలు వ్యతిరేకించడంతో సుప్రీంకోర్టు దాని రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తున్న సమయంలోనే ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
>
మరిన్ని వార్తలు