ప్రేమలేఖలు రాసే ఏజ్‌లో ఎన్నో కష్టాలుపడ్డా: నటి

26 Jun, 2017 12:59 IST|Sakshi
ప్రేమలేఖలు రాసే ఏజ్‌లో ఎన్నో కష్టాలుపడ్డా: నటి

ముంబై: ‘ప్రేమలేఖలు రాస్తూ.. ప్రేమలో గుడ్డిగా విహరించాల్సిన వయస్సులోనే నేను ఎన్నో కష్టాలు పడ్డాను’ అంటున్నారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె తాజాగా ఓ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘అనుపమ్‌ ఖేర్స్‌ పీపుల్‌’ షోలో మాట్లాడారు. ‘అమ్మాయిలు ప్రేమలేఖలు రాస్తూ.. ప్రేమలో విహరించే సమయంలో నేను ఎంతో కష్టపడ్డాను. సుదీర్ఘంగా పనిచేయాల్సి వచ్చేది. మహేశ్‌ భట్‌ లాంటి మేధావులు, సామాజికవేత్తలతో కలిసి కూచొని పని చేయాల్సి వచ్చేది. మీరొక టీనేజర్‌గా ఉండి అంతటివారితో కూర్చున్నప్పుడు ఏమీ మాట్లాడే వీలుండదు’ అని ఆమె చెప్పారు.

‘చిన్న వయస్సులోనే ఇంటి నుంచి వచ్చేయడంతో అందరి పిల్లలాగా నాకు ఆడుకునే వీలుగా చిక్కలేదు. టీనేజర్‌గా ఉండగానే నాకు కష్టాలు ఎదురయ్యాయి. సెట్స్‌లో పనిచేయాల్సి వచ్చింది. 17 ఏళ్ల వయస్సులోనే జీవన్మరణ సమస్యలు ఎదుర్కొన్నాను. నా జీవితమంతా ఎప్పుడూ తిరుగుబాటుతత్వమే’ అని ఆమె తెలిపింది. కరణ్‌ జోహర్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’లో బాలీవుడ్‌లో ఆశ్రితపక్షపాతం గురించి బోల్డ్‌గా స్పందించడంపైనా ఆమె మాట్లాడారు. ఈ చర్చ వల్ల తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని, తాను సొంతంగా ప్రొడక్షన్‌హౌస్‌ ప్రారంభించి స్వయంగా నిలదొక్కుకునే దశలో ఉన్నానని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు