ఆయేషా లక్ష్యం.. ఆకాశమే!

5 Apr, 2017 22:37 IST|Sakshi
ఆయేషా లక్ష్యం.. ఆకాశమే!

అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధమవుతున్న కశ్మీరీ యువతి
జమ్ము: ఆయేషా అజీజ్‌ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకుంటోంది. త్వరలోనే పైలట్‌గా యుద్ధవిమానాన్ని నడుపబోతోంది. గతవారమే పైలట్‌గా కమర్షియల్‌ లైసెన్స్‌ పొందిన ఈ 21ఏళ్ల కశ్మీర్‌ యువతి.. త్వరలో మిగ్‌–29 యుద్ధవిమానంలో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. రష్యాలోని సొకుల్‌ ఎయిర్‌బేస్‌లో జరిగే ఈ పరీక్షలో ఆయేషా సఫలీకృతమైతే మిగ్‌–29 యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ యువతిగా ఆయేషా ఘనత సాధిస్తుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆకాశపు అంచులదాఆయేషా అజీజ్‌ పైలట్‌కశ్మీర్‌ యువతికా దూసుకెళ్లాలనుకుంటున్నా. అందుకే రష్యాలో మిగ్‌–29 యుద్ధ విమానాన్ని నడిపేందుకు సిద్ధమవుతున్నా. జెట్‌ ఫైటర్‌ను నడపడానికి ఉవ్విళ్లూరుతున్నా’నని చెప్పింది. పాఠశాలలో ఉన్నప్పుడే పైలట్‌కు అవసరమైన శిక్షణ కార్యక్రమాల్లో ఆయేషా పాల్గొనేది. దీంతో 16 సంవత్సరాలకే బాంబే ఫ్లయింగ్‌ క్లబ్‌ ఆమెకు స్టూడెంట్‌ పైలట్‌ లైసెన్స్‌ ఇచ్చింది. 2012లో నాసా నిర్వహించిన రెండు నెలల అడ్వాన్స్‌డ్‌ స్పైస్‌ ట్రెయినింగ్‌ను కూడా ఆయేషా పూర్తిచేసింది. ఈ శిక్షణకు ఎంపికైన ముగ్గురు భారతీయుల్లో ఆయేషా ఒకరు.

సునీతా విలియమ్స్‌ తనకు స్ఫూర్తి అని చెప్పే ఆయేషా.. అంతటి కీర్తిప్రతిష్టలను సాధించాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది. జమ్ములోని బారాముల్లా జిల్లాకు చెందిన ఆయేషా తండ్రి ముంబై వాసి. తన కూతురు సాధిస్తున్న విజయాలను చూస్తూ మురిసిపోతున్న ఆయన ఆయేషా గురించి మాట్లాడుతూ.. ‘నా కూతురు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా ఉంది. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేమంతా కోరుకుంటున్నామ’న్నారు.

ఆయేషా సోదరుడు ఆరీబ్‌ లోఖండ్‌వాలా మాట్లాడుతూ... ‘అక్కే నాకు రోల్‌మోడల్‌. ఆమె సాధిస్తున్న విజయాలు నాకెన్నో లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. తప్పకుండా అక్క చూపిన బాటలోనే నడుస్తాన’న్నాడు. కశ్మీర్‌లోని పరిస్థితులు ఏవీ తన లక్ష్యానికి అడ్డురాలేదని, మిగతా బాలికలు కూడా లక్ష్యంపై గురిపెట్టి విజయాలు సాధించాలని తాను కోరుకుంటున్నానని ఆయేషా చెప్పింది.

మరిన్ని వార్తలు