ఢిల్లీ కోటలో పాగా వేస్తాం

27 Apr, 2017 17:03 IST|Sakshi
ఢిల్లీ కోటలో పాగా వేస్తాం

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ను బెదిరించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, బెంగాల్‌ ఎప్పుడూ ఇలాంటి వాటికి భయపడదని ఆ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. టీఎంసీని చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే ఇలాంటి వ్యూహం పాటిస్తోందని అన్నారు. తమకు ఎవరు సవాల్ చేసినా స్వీకరిస్తామని, ఎవరికీ బెదరబోమని, ఢిల్లీ కోటలో పాగా వేస్తామని మమత చెప్పారు. గురువారం బిర్పారలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు.

పశ్చిమబెంగాల్‌లోని వెనుకబడిన ప్రాంతాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటించడంపై మమత స్పందిస్తూ.. ఢిల్లీలో నుంచి వచ్చినవారు అబద్ధాలు చెబుతారని, వాళ్లు అధికారకాంక్షతో ఉన్నారని అన్నారు. బీజేపీ నాయకులు బెంగాల్‌లో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, టీఎంసీ నేతలపై సీబీఐని ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని 2014 ఎన్నికలపుడు బీజేపీ నేతలు హామీ ఇచ్చారని, మూడేళ్లయినా ఇప్పటికీ ఈ హామీని నిలబెట్టుకోలేదని మమత విమర్శించారు.
 

మరిన్ని వార్తలు