కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లిన విద్యార్థులు

17 Sep, 2016 15:38 IST|Sakshi
కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లిన విద్యార్థులు

భోపాల్: కేంద్ర మంత్రికి సమస్యలు విన్నవించుకోవాలనుకున్న విద్యార్థులు.. ఆగకుండా వెళ్లిపోతున్న ఆయనను ఆపేందుకు పరిధిదాటి ప్రవర్తించారు. మంత్రిగారిపైనే ఇంక్ చల్లారు. శనివారం భోపాల్ ఎయిమ్స్ లో చోటుచేసుకుందీ సంఘటన.

అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు భోపాల్ ఎయిమ్స్ కు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను అదే కళాశాల మెడిసిన్ విద్యార్థులు చుట్టుముట్టారు. ఎయిమ్స్ లో నెలకొన్న సమస్యలను మంత్రికి విన్నవించుకోవాలనుకున్నారు. కానీ ఎంతకూ వినిపించుకోకపోవడంతో ఆయనపై ఇంక్ చల్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి మంత్రి నడ్డాను కారు వద్దకు తీసుకెళ్లి పంపించేశారు.

'మా కాలేజీలో అనేక సమస్యలున్నాయి. సరైన అధ్యాపకులు లేరు. వసతి కూడా దారుణంగా ఉంది. ఈ విషయాలను మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాం. కానీ ఆయన ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఆయన్ని ఎలాగైనా ఆపాలనే ఇంక్ చల్లాం తప్ప మరో ఉద్దేశం కాదు'అని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసు ఫిర్యాదు దాఖలుకాలేదు.

మరిన్ని వార్తలు