57 స్థానాల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ
♦ కాంగ్రెస్ 11, స్వతంత్రులు 2 స్థానాల్లో విజయం
♦ పోటీ చేసిన రెండు చోట్లా సీఎం రావత్ ఓటమి
♦ సీఎం అభ్యర్థి రేసులో విజయ్ బహుగుణ, సత్పాల్ ముందంజ
డెహ్రాడూన్: ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని నిజం చేస్తూ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీయడంతో కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగగా 57 స్థానాలు గెలిచి కమలం పార్టీ అధికారం చేజిక్కించుకోగా... కాంగ్రెస్ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. రెండు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి తప్పదనే విషయాన్ని ఈ ఎన్నికలు మరోసారి రుజువుచేశాయి. ఈ 16 ఏళ్లలో ఒక పార్టీ ఇంత భారీ మెజార్టీ సాధించడం ఇదే మొదటిసారి. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరుసాగగా... ఈ సారి బీజేపీ ఏకపక్ష విజయాన్ని సాధించడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 32, బీజేపీ 31 స్థానాలతో హోరాహోరీ తలపడ్డ సంగతి తెలిసిందే.
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఓటమి
ఇక పోటీ చేసిన రెండు స్థానాల నుంచి సీఎం హరీష్ రావత్ ఓడిపోవడం కాంగ్రెస్ పరిస్థితికి అద్దంపట్టింది. సహస్పూర్ నుంచి పీసీసీ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ కూడా ఓటమిని చవిచూశారు. బీజేపీ రికార్డు విజయం సాధించినప్పటికీ... రాణిఖేట్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ ఓటమి పాలవడం పార్టీ శ్రేణుల్ని నిరాశకు గురిచేసింది. రెబల్ అభ్యర్థి పోటీ వల్లే అజయ్ భట్ ఓడిపోయారనేది బీజేపీ నేతల వాదన.. ఉత్తరాఖండ్ గెలుపులో మోదీ హవా కీలకంగా పనిచేసిందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు. ‘మోదీ గాలి మాకు అనుకూలంగా వీచింది. అలాగే హరీష్ రావత్ హయాంలో అవినీతి తారాస్థాయికి చేరడంతో ఏర్పడ్డ ప్రభుత్వ వ్యతిరేకత కూడా పనిచేసింది’ అని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ చెప్పారు.
సీఎం బరిలో ఐదుగురు
మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పదవి కోసం బీజేపీ నుంచి పలువురు పోటీ పడుతున్నారు. వారిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, సీనియర్ నేత స త్పాల్ మహారాజ్లు ముందు వరుసలో ఉన్నారు. వీ రిద్దరు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినవారే... విజ య్ బహుగుణ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో 2016లో బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో 9 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో తానే సీఎం అభ్యర్థన న్న ధీమాలో ఆయన ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్ని కల్లో బహుగుణ పోటీ చేయకుండా కొడుకు సౌరభ్ను రంగంలో నిలిపారు. సితార్ గంజ్ నుంచి సౌరభ్ భా రీ మోజార్టీతో గెలుపొందారు. విజయ్ బహుగుణకు ప్రధాన పోటీదారు సత్పాల్ మహరాజ్... ఆయన మూడేళ్ల క్రితమే బీజేపీలో చేరారు. సత్పాల్కు ఆర్ఎస్ఎస్ నేతలు, పార్టీ అధినాయకత్వంతో మంచి సంబంధాలున్నాయి. హరిద్వార్ ఎంపీ పోఖ్రియాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు త్రివేంద్ర రావత్ కూడా సీఎం పదవికి పోటీపడుతున్నారు.