వేదాంతలో కెయిర్న్ విలీనానికి ఓకే

14 Jun, 2015 14:34 IST|Sakshi
వేదాంతలో కెయిర్న్ విలీనానికి ఓకే

న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియా... వేదాంత ఇండియాలో విలీనం కానుంది. విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఆమోదముద్ర వేశాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా డీల్ పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. విలీనానికి సంబంధించి డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉండనుంది. కెయిర్న్‌ఇండియా షేర్‌హోల్డర్లకు వేదాంత (గతంలో సెసా స్టెరిలైట్) షేర్లు లభించనున్నాయి.

విలీనానికి శ్రీకారం చుట్టే దిశగా వేదాంత ఇటీవలే.. గ్రూప్‌లో భాగమైన ట్విన్ స్టార్ మారిషస్ హోల్డింగ్స్ నుంచి సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. 2011లో వేదాంత 8.67 బిలియన్ డాలర్లు వెచ్చించి కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31 దాకా గణాంకాల ప్రకారం వివిధ వ్యాపార విభాగాల ద్వారా కెయిర్న్ ఇండియాలో వేదాంతకు 59.9 శాతం వాటాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు