కృష్ణా జలాలపై తుది తీర్పు, రాష్ట్రానికి తీరని నష్టం

29 Nov, 2013 11:43 IST|Sakshi
కృష్ణా జలాలపై తుది తీర్పు, రాష్ట్రానికి తీరని నష్టం


కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ తుది తీర్పు వెల్లడించింది. ఇందులోనూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టమే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్‌.. తుంగభద్ర జలాల్లో 4 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే కేటాయించింది. అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇది శరాఘాతంగా మారనుంది. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు 190 టీఎంసీల నీరు అవసరం. ఈ ప్రాజెక్టులను 14వేల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేశాం.

 ప్రస్తుతం వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. నికరజలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కే అతితక్కువ కేటాయింపు జరిగింది. కర్ణాటకకు  43 టీఎంసీలు, మహారాష్ట్రకు 65 టీఎంసీలు కేటాయించగా.. ఆంధ్రప్రదేశ్‌కు 39 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాల విషయంలో మహారాష్ట్రకు 35 టీఎంసీలు, కర్ణాటకకు 105 టీఎంసీలు, ఆంధప్రదేశ్‌కు 145 టీఎంసీలు ఇచ్చారు. అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు. ప్రస్తుత తీర్పుతో ఆల్మట్టి ప్రాజెక్ట్‌ ఎత్తు 519 .5 నుంచి 524.25 మీటర్లకు పెరుగుతుంది. దీనివల్ల దాదాపు 100 టీఎంసీల నీటిని ఎక్కువుగా వాడుకోనున్నారు. మొత్తంగా బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు రాష్ట్ర రైతులకు శరాఘాతమేనని భావించాలి.

>
మరిన్ని వార్తలు