బుల్లెట్లు తగిలినా భద్రంగా..

25 Mar, 2016 02:14 IST|Sakshi

బ్యాంకాక్: దుండగుల కాల్పుల్లో తనకు బుల్లెట్లు తగిలినా మెరుపువేగంతో బస్సు నడిపి బస్సులోని మొత్తం ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు ఓ డ్రైవర్. లావోస్ దేశంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం వాంగ్ వియాంగ్‌లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నైరుతి చైనాలోని కున్‌మింగ్ పట్టణం నుంచి 28 మంది ప్రయాణికులతో బయల్దేరిన బస్సు బుధవారం రాత్రి సమయంలో వాంగ్‌వియాంగ్‌కు చేరుకోగానే సాయుధులైన దుండగులు బస్సుపై తుపాకులతో కాల్పులు ప్రారంభించారు.


ఊహించని ఈ పరిణామంతో భయపడకుండా ఆ బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ముందుకు పోనిచ్చి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో డ్రైవర్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. బస్సులో ఉన్న ఆరుగురు చైనా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. చైనీయులపై లావోస్‌లో ఇలా మెరుపుదాడులు జరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.

 

మరిన్ని వార్తలు