మసూద్‌పై ఆధారాలున్నాయ్‌

23 Feb, 2017 14:17 IST|Sakshi
మసూద్‌పై ఆధారాలున్నాయ్‌

సాక్ష్యాలు చూపాలన్న చైనా డిమాండ్‌పై భారత్‌  
బీజింగ్‌: జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ దుశ్చర్యలన్నిటికీ ‘పక్కాఆధారాలు’ ఉన్నాయని భారత్‌ స్పష్టం చేసింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని బ్రిటన్, ఫ్రాన్స్‌ మద్దతుతో అమెరికా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో సరైన ఆధారాలు చూపాలన్న చైనా డిమాండ్‌పై భారత్‌ తాజాగా స్పందించింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌. జైశంకర్‌ మాట్లాడుతూ తమ వద్ద మసూద్‌ దుశ్చర్యలకు సంబంధించి సరైన ఆధారాలు ఉన్నాయన్నారు.

అయితే ఈ విషయంపై ఇతర దేశాలను ఒప్పించాల్సిన బాధ్యత భారత్‌పై లేదన్నారు. దీనిపై ఐరాసలో దరఖాస్తు పెట్టిన దేశాలు మసూద్‌కు సంబంధించి బాగా తెలిసుకున్నాయి కాబట్టే ఆ ప్రతిపాదన చేశాయని.. లేకుంటే అసలా ప్రస్తావనే తెచ్చేవి కావని అన్నారు. ఆయన బుధవారం చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ ఇతో సమావేశమయ్యారు. ఇండో–చైనా వ్యూహాత్మక సమావేశాల్లో భాగంగా ఇది జరిగింది. ఎన్‌ఎస్‌జీ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌ సభ్యత్వంపై చైనా సానుకూలంగా ఉందన్నారు. అయితే విధివిధానా లపై ఆ దేశానికి తనదైన వైఖరి ఉందన్నారు. 

మరిన్ని వార్తలు