వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

21 Nov, 2015 07:00 IST|Sakshi
వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

వరంగల్ : వరంగల్ లోక్సభ స్థానం ఉప ఎన్నికకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 1778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మందికిపైగా భద్రత సిబ్బందిని అందుకోసం వినియోగించారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను మోహరించారు. తొలిసారిగా ఈవీఎంలపై పార్టీ గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సమస్యాత్మక మైన పోలింగ్ కేంద్రాల్లో 626 వెబ్ లైవ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఉప ఎన్నిక విధుల్లో 9428 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో  దాదాపు 15 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిసారిగా ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలో  మొదటిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరును అధికారులు పుష్పగుచ్ఛం అందజేస్తారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అయితే ఆయన కేసీఆర్ మంత్రి వర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలు