ఖాతాదారులపై మరో పిడుగు

21 Mar, 2017 19:15 IST|Sakshi
ఖాతాదారులపై మరో పిడుగు

న్యూఢిల్లీ: డిజిటల్‌ లావాదేవీలు, నల్లధనాన్ని నిరోధించేందుకంటూ కేంద్రప్రభుత్వం ఖాతాదారుల నెత్తిన మరో పిడుగువేయనుంది.  నగదు  లావాదేవీలపై  సరికొత్త ఆంక్షలు విధించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది.

గతంలో పేర్కొన్నట్టుగా రూ.3లక్షల పరిమితికాకుండా కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది.  దీనిప్రకారం రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతే మొత్తం(100శాతం) జరిమానా రూపంలో సమర్పించు కోవాల్సి వస్తుంది. రెండు కంటే ఎక్కువ లక్షల నగదు లావాదేవీలు చేయడాన్ని ఇక మీదట  అక్రమంగా పరిగణించి, జరిమానా విధించనున్నామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిబంధన వచ్చే నెలనుంచి అమల్లోకి రానుంది.  ఈ నిబంధనను అతిక్రమిస్తే.. లావాదేవీ మొత్తంపై 100 శాతం జరిమానా విధించేందుకు ప్రతిపాదించింది. అయితే  ఈ నగదు నిబంధనలు ప్రభుత్వానికి, బ్యాంకింగ్‌ కంపెనీలకు,పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌  ఖాతాలకు, కో -ఆపరేటివ్ బ్యాంక్‌ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది.  

అయితే ఫిబ్రవరిలో సమర్పించిన ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  నగదు లావాదేవీలపై మూడు లక్షలు పరిమితిగా నిర్ణయించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్ట సవరణ అనంతరం దీన్ని అమలు చేయనున్నట్టు  చెప్పారు. అయితే తాజాగా ఈ పరిమితిని రెండు లక్షలు కుదించడం గమనార్హం.

కాగా  నల్లధనానికి చెక్‌పెట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించి నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో ప్రతిపాదిస్తూ 2017–18 కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నిబంధన భారీ నగదు లావేదేవీల విషయంలో వెనక్కి తగ్గేలా చేస్తుందన్నారు.  అలాగేబడ్జెట్‌ అనంతరం భారీ నగదు లావాదేవీలన్నింటినీ ప్రభుత్వం పట్టుకుంటుందని, అలాగే నగదు ఆధారిత వినియోగానికి ఉన్న అవకాశాలను కూడా మూసివేస్తుందని  రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్‌ అధియా ప్రకటించారు.  లెక్కల్లో చూపని ఆదాయానికి కొత్త నిబంధనల కింద ఇటువంటి మార్గాలకు చెక్‌ పెట్టనున్నట్టు పేర్కొన్నారు.   ఈ నిబంధన వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పారు.  అలాగే రూ.2 లక్షలకు పైబడి నగదు లావాదేవీకిగాను గ్రహీత,  లేదా చెల్లిస్తున్న వ్యక్తి యొక్క పాన్‌ నంబర్‌ కానీ  ఐటీ ఐడెంటిఫికేషన్‌ వివరాలుగానీ  నమోదు చేయా లన్న పాత నిబంధన ఇకపైనా కొనసాగనుంది.

>
మరిన్ని వార్తలు