ప్రియుడికి ఉరి... ప్రియురాలికి విషం

14 Oct, 2014 21:08 IST|Sakshi
ప్రియుడికి ఉరి... ప్రియురాలికి విషం

మొరదాబాద్: అభ్యంతరకర రీతిలో పట్టుబడిన ప్రేమికులపై పెద్దలు ప్రతాపం చూపారు. ప్రియుడిని ఉరేసి చంపారు. ప్రియురాలి నోట్లో విషం పోశారు. సంచలనం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ జిల్లా భర్తాల్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. రాకేష్ సింగ్(17), సుష్మ(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా సుష్మ తండ్రి మఖాన్ సింగ్, ఆయన నలుగురు కుమారులు సుఖ్వీర్, సునీల్, సుశీల్, ఉమైద్ లకు తమింట్లో కంటపడ్డారు.

తమ పిల్ల పరాయివ్యక్తితో కనబడడంతో మఖాన్ సింగ్, ఆయన కుమారులు కోపంతో రగిలిపోయారు. రాకేష్ సింగ్ ను ఉరేసి చంపారు. సుష్మతో బలవంతంగా విషం తాగించారు. తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి రాకేష్ మృతి చెందాడు. చావుబతుకుల్లో ఉన్న సుష్మను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

తన కుమారుడిని ఇనుప రాడ్ తో కొట్టి తర్వాత ఉరేసి చంపారని రాకేష్ తండ్రి ఆరోపించారు. సుష్మ కుటుంబ సభ్యులు పరువుహత్య పాల్పడ్డారని పేర్కొన్నారు. మరోవైపు ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సుష్మ చావుబతుకుల్లో ఉండడంతో ఆమె వాంగ్మూలం తీసుకోవడం పోలీసులకు సాధ్యపడలేదు. రాకేష్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని మొరదాబాద్ రూరల్ ఎస్పీ తెలిపారు.

>
మరిన్ని వార్తలు