ఆ స్కాంలో పీఎంవో హస్తముంది!

10 Dec, 2016 19:11 IST|Sakshi
ఆ స్కాంలో పీఎంవో హస్తముంది!
  • యూపీఏ హయాంలో పీఎంవో చెప్పడంతోనే..
  • వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంలో మార్పులు
  • కోర్టుకు తెలిపిన ఎస్పీ త్యాగీ

  • న్యూఢిల్లీ: యూపీఏ–2 హయాంలో జరిగిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ఎస్పీ త్యాగి కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి ప్రధానమంత్రి (మన్మోహన్‌ సింగ్‌) కార్యాలయం (పీవోఎం) ప్రమేయం కారణంగానే బ్రిటన్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీకి అనుకూలంగా ఒప్పందంలోని నిబంధనలు మార్చినట్టు ఆయన పేర్కొన్నారు.  12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందంలో మార్పులు చేసి రూ.450 కోట్ల ముడుపులు తీసుకున్న ఈ కేసులో శుక్రవారం ఎయిర్‌ ఫోర్సు మాజీ చీఫ్‌ ఎస్పీ త్యాగితోపాటు అతని సోదరుడు సంజయ్, లాయర్‌ గౌతమ్‌ ఖైతాన్ ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం వీరిని విచారణకు పిలిచిన అధికారులు.. నాలుగు గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వారిని శనివారం కోర్టులో హాజరుపరుచగా..  విచారణ కోసం నాలుగురోజులపాటు వారిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. వీవీఐపీ హెలికాప్టర్లలో మార్పులు తన ఒక్కడి నిర్ణయం ప్రకారం జరగలేదని, ఈ కొనుగోలు ఒప్పందంలో పాలుపంచుకోవాలని 2003లో అప్పటి పీఎంవో కోరిందని, 2004లో పీఎంవో హెలికాప్టర్ల ఒప్పందంలో మార్పులు కోరిందని ఆయన చెప్పుకొచ్చారు.  

    వీఐపీ హెలికాప్టర్లు ఎగరాల్సిన ఎత్తును 6వేల అడుగుల నుంచి తగ్గించేలా నిబంధనలు మార్చేలా  2005లో త్యాగి అంగీకరిచారని,  అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రూ. 450 కోట్ల ముడుపులు తీసుకుని త్యాగి నిబంధనలు మార్చేలా అధికారులను ప్రభావితం చేశారని సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి త్యాగితోపాటు మరో 18 మందిపై (అతని సోదరులు, యురోపియ¯ŒS మధ్యవర్తులు, కంపెనీలు) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సహకరించేందుకు పలు దేశాలకు రొగేటరీ లెటర్ల (న్యాయపరమైన అభ్యర్థనలు)ను జారీ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంపై ఆరోపణలు రావటంతో 2014 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దుచేసింది.




     

>
మరిన్ని వార్తలు