తమిళనాడులో కేంద్రం జోక్యమా.. లేదు: వెంకయ్య

8 Feb, 2017 10:39 IST|Sakshi
తమిళనాడులో కేంద్రం జోక్యమా.. లేదు: వెంకయ్య
తమిళనాడులో పరిస్థితులను ఆ రాష్ట్ర గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. మీడియాలో వచ్చిన కథనాలతో పాటు.. అధికారుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగానికి లోబడి మాత్రమే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో పరిణామాలపై న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలపై తాను మాట్లాడదలచుకోలేదని, తమిళనాడు వ్యవహారంలో ఎవరినీ కించపరచాలన్నది తమ ఉద్దేశం కాదని ఆయన చెప్పారు. 
 
గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని, అలాగే న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. గవర్నర్ మీద కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వెంకయ్య నాయుడు చెప్పారు.