న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు దిగనున్నారు. తమ వేతన పెంపుపై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపిస్తూ వివిధ శాఖలకు చెందిన కేంద్ర ఉద్యోగులు గురువారం ఒకరోజు సమ్మె చేపట్టనున్నారు. అయిదురాష్ట్రాల ఎన్నికల సందర్భంగా వాయిదాపడిన ఈ సమ్మెను రేపు ( గురువారం) నిర్వహించనున్నారు. ముఖ్యంగా పోస్టల్, ఆదాయ పన్ను శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, సెన్సస్, సెంట్రల్ భూగర్భజల బోర్డు, ఆటమిక్ పవర్కు చెందిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఈ సమ్మెలు పాల్గొంటున్నారు. 7వ వేతన సంఘం సిఫారసు చేసిన తక్కువ వేతనాలపైనా, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ పోరాటానికి దిగుతున్నారు.
దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణన్ ఒక ప్రకటనలోతెలిపారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు, క్యాజువల్, కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగులు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారని తెలిపారు. గత నెలఫిబ్రవరి 16న చేపట్టేందుకు నిర్ణయించిన ఈ సమ్మెను మార్చి 16కి వాయిదావేసినట్టు చెప్పారు.
కేంద్ర సర్కార్ 33 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,34 లక్షలు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం కనీస రూ .25వేలుగా సవరించాలని కోరుతున్నారు. కనీస వేతనం, ఫిట్మెంట్ రూల్, హెచ్ఆర్, డీఏ, ఉద్యోగులు రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఫిబ్రవరి 16 న సమ్మెకు పిలుపున్చిన సమాఖ్య, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తరువాత మార్చి 16 దానిని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.